Friday, December 29, 2023

ఐశ్వర్య దీపం ఉపయోగాలు

ఐశ్వర్య దీపం /ఉప్పు దీపం
ఉపయోగాలు :-

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎలా పెడతారో
తెలుసుకుందాము.

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ  పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు, కుంకుమా రాసి నేలపైన బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదాని పైన ఒకటిగా  పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమలు  చల్లాలి. చిన్న ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఆ రాళ్ళ ఉప్పు పైన పెట్టి పసుపు, కుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.

పళ్ళు కానీ, పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలులోని ఉప్పును తీసి నీటిలో కలపాలి, వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి. నీళ్ళలో వేయడమే సరైన పద్ధతి. అవకాశం ఉన్నవాళ్లు  నదిలో కలపవచ్చు, ప్రమిదలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు. 


ప్రతి వారం అవి వాడుకోవచ్చు, ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి. 

ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం లు కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి . ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది, అంటే పూర్తి  ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారాలు ఈ విధం గా  ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్ధిక  ఇబ్బందులు తొలగిపోతాయి. 

రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం. తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్ళలో వేసి కలిపి కరిగాక చెట్లకు పోయవచ్చును, ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.